Israel: ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకారం.. క్షిపణులతో దాడి

  • శుక్రవారం తెల్లవారుజామున ఒక మిసైల్‌తో దాడి చేసిన ఇజ్రాయెల్
  • అమెరికా సీనియర్ అధికారి వెల్లడి
  • టెహ్రాన్, ఇస్పాహాన్, షిరాజ్ నగరాల్లో పేలుడు శబ్దాలు వినిపించాయంటున్న మీడియా కథనాలు
Israel launches missiles in retaliatory strike on Iran says US official

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడికి దిగింది. శుక్రవారం తెల్లవారు జామున ఇజ్రాయెల్ ఒక క్షిపణితో దాడి చేసిందని అమెరికా సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. టెహ్రాన్, ఇస్ఫాహాన్, షిరాజ్ నగరాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. 

ఇరాన్‌లోని ఇస్ఫాహాన్‌లో విమానాశ్రయం, 8వ ఆర్మీ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లకు సమీపంలో పేలుడు శబ్దం వినిపించిందని ఇరాన్ వార్తా సంస్థ ‘ఫార్స్’ పేర్కొంది. ఇరాన్ వైమానిక రక్షణ దళాలు దాడిని తిప్పికొట్టాయని పేర్కొంది. కాగా టెహ్రాన్, ఇస్ఫాహాన్, షిరాజ్ నగరాల మీదుగా వెళ్లే విమాన సర్వీసులను ఇరాన్ అధికారులు తాత్కాలికంగా రద్దు చేసినట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ క్షిపణి దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు సిరియా, ఇరాక్‌లలో కూడా పేలుళ్లు జరిగినట్లు పలు మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి.

గత శనివారం ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీ సంఖ్యలో డ్రోన్‌లు, క్షిపణులతో దాడి చేసిన విషయం తెలిసిందే. 300లకుపైగా డ్రోన్లను ప్రయోగించగా కొన్ని మినహా అన్నింటినీ ఇజ్రాయెల్ విజయవంతంగా కూల్చివేసింది. మిత్రదేశం అమెరికాతో కలిసి అడ్డుకుంది. సిరియాలోని డమాస్కస్‌లోని తమ కాన్సులేట్ కార్యాలయంపై దాడికి ప్రతీకారంగా ఈ దాడి చేశామని ఇరాన్ ప్రకటించింది. అయితే ఈ దాడికి సరైన సమయంలో, సరైన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రకటించిన విషయం తెలిసిందే.

More Telugu News